Huge Hole On National Highway 44 : ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారి నిరాదరణకు గురవుతోంది. హైదరాబాద్ టూ నాగ్పూర్ మధ్య రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ రహదారిని అధికారులు పట్టించుకోవటం లేదు. ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ రహదారిపై తాజాగా నేరడిగొండ మండలం కుప్టి వాగుపై ఉన్న పాత వంతెనకు మధ్యలో భారీ రంధ్రం పడింది. రంధ్రంపై డ్రమ్ములను మూసి ఉంచిన అధికారులు మరో మార్గంలో వాహన రాకపోకలను దారి మళ్లించారు.గుట్టలతో ఉన్న ఈ ప్రాంతంలో దిగువ భాగాన ఉన్న పురాతన వంతెన తొలగించి కొత్త వంతెన నిర్మించాలనే అంశం ఎప్పటి నుంచో ఉంది. కానీ ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపకపోవటంతో శిథిలావస్థకు చేరుకొంది. ఇప్పుడు వంతెన మధ్యలోనే రంధ్రం పడింది. ప్రయాణికులతో వచ్చే బస్సు వెళ్లే క్రమంలో రంధ్రం పడి ఉండి ఉంటే భారీ ప్రమాదం చోటుచేసుకుని ఉండేది. ఇప్పటికైనా జాతీయ రహదారుల సంస్థ యుద్ధ ప్రాతిపదికన కొత్త వంతెన నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments