Botsa Cry in Vizianagaram : వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కంటతడి పెట్టారు. ఇవాళ విజయనగంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బొత్సతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లడుతున్న సమయంలో బొత్స భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆయణ్ని నాయకులు, కార్యకర్తలు ఓదార్చారు.రెండు రోజుల క్రితమే విజయనగరం జిల్లా గరివిడిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి వెళ్లారనే విషయాన్ని ప్రస్తావిస్తూ నేతలు ఆవేదనకు గురయ్యారు. చిన్న శ్రీనుతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకుంటుండగా ఒక్కసారిగా బొత్స భావోద్వేగానికి లోనయ్యారు. ఏడుపు ఆపుకోలేక ఒక్కసారిగా బోరుమన్నారు. పక్కనే ఉన్న బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఆయణ్ని ఊరుకోమంటూ ఓదార్చారు. దీంతో సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. దీనిని చూసి కార్యకర్తలు కూడా కంటతడి పెట్టారు. పార్టీ కోసం కలిసి నడిచిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. 'మీరు బాధపడొద్దంటూ, మీకు మేమున్నామంటూ శ్రేణులు భరోసా ఇచ్చారు. జై బొత్స అంటూ నినాదాలు' చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన సమావేశంలో వరుసగా బొత్స రెండోసారి కంటతడి పెట్టారు.
Comments